కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే
కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు హస్తినలో మకాం వేసివున్నారు. వారిద్దరూ కలిసి ఢిల్లీలోని కర్నాటక భవన్కు వెళ్లారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ సిద్ధరామయ్య, డీకేలు ఢిల్లీలో కనిపించడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
ఆ తర్వాత పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సిద్ధు భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే పూర్తి కాలం కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పరోక్షంగా అధిష్ఠానాన్ని కోరిన సిద్ధరామయ్య.. తదుపరి (2028) ఎన్నికలకు శివకుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిద్దామని సూచించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ అధిష్ఠానం తనను ఏ విషయమైనా అడిగేంత వరకు మౌనంగా ఉండాలని శివకుమార్ భావిస్తున్నారు.
ఇదిలావుంటే, కర్ణాటక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ కానున్నారు. ఖర్గే నివాసంలో వీరు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణపైనే ఆయన చర్చిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఆదివారం డీకే, ఖర్గే భేటీ కావడం గమనార్హం.