1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (10:11 IST)

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదు : కేంద్రం స్పష్టం

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదని చెప్పింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విధించిన కోవిడ్ నిబంధనల్లో బలవంతపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎక్కడా లేదని గుర్తుచేసింది.
 
అంగవైకల్యంతో బాధపడుతున్నవారు టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కష్టతరమని, అందువల్ల వారికి వారి ఇంటివద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్చంధ సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోతే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. 
 
దీనిపై విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని ఆ అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదని తేల్చి చెప్పింది.
 
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెబుతుందని, దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్‌‍ఫామ్స్‌ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పింది. ఏ ఒక్కరికీ వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేది వారి వ్యక్తిగత అంశమని స్పష్టం చేసింది.