1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (15:44 IST)

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్థాన్‌కు వేసినట్టేనన్న నవనీత్ కౌర్.. కేసు నమోదు!!

navneet kaur
సిన నటి, ఎంపీ నవనీత్ కౌర్‌పై ఎన్నికల సంఘం ఆదేశం మేరకు హైదరాబాద్ షాద్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్థాన్‌కు ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం... నవనీత్ కౌర్‌పై కేసు నమోదుకు ఆదేశించారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
ఇటీవల షాద్ నగర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్థాన్‌కు ఓటేసినట్టేనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరగణించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం : హోం మంత్రి అమిత్ షా 
 
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి దేశంలో మతపరమైన రాజకీయాలకు తాము వ్యతిరేకమని, ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, భువనగిరిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే అబద్దాలు చెప్పి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. తాము పదేళ్లుగా పూర్తి మెజార్టీలో ఉన్నా రిజర్వేషన్లు తీసివేయలేదని గుర్తించాలన్నారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని... ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తామని ఆయన సభా ముఖంగా హామీ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తే సాయంత్రానికి అంతా అయిపోతుందని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.12 వేల రైతు కూలీ, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఏళ్ల పాటు అడ్డుకుందని ఆరోపించారు. మోడీ హయాంలో రామాలయం పూర్తి చేశామన్నారు. రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కాశ్మీర్‌తో ఏం పని అని మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ కోసం భువనగిరి వాసులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసి మోడీ కాశ్మీర్ మనదేనని చాటారన్నారు.
 
కేంద్రంలో బీజేపీ వచ్చాక ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీలు నిలువరించగలవా? అని ప్రశ్నించారు. ఎ అంటే అక్బరుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్... ఇవన్నీ ఒక్కటేనని విమర్శించారు. ఈ మూడు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోందని మండిపడ్డారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టను కాంగ్రెస్ బహిష్కరించిందని అమిత్ షా గుర్తు చేశారు.