శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (12:31 IST)

భారత్ బయోటెక్‌కు భారీ భద్రత : 64 మంది కమెండోలతో రక్షణ

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్ బయోటెక్‌కు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌ శివారు శామీర్ పేట జినోమ్‌వ్యాలీలో ఉన్న కంపెనీ ప్రాంగణానికి 64 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమెండోలతో రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ నెల 14 నుంచి కమెండోలు పరిశ్రమకు రక్షణగా ఉంటూ పహారా కాస్తారని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనిల్ పాండే తెలిపారు. కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థపై ఉగ్రవాదుల కన్ను పడే అవకాశం ఉండడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు సంస్థలకు ఇలాంటి భద్రత కల్పిస్తూ వస్తోంది. పూణె, మైసూరులోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్‌లోని రాందేవ్ బాబా పతంజలి సహా దేశవ్యాప్తంగా పది చోట్ల ఇలాంటి భద్రత కల్పించింది. తాజాగా భారత్ బయోటెక్‌కు సీఐఎస్ఎఫ్ కమెండోలతో భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
 
కాగా, భారత్‌లో కోవిషిల్డ్, కోవాగ్జిన్ రెండు వాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న విషయం తెల్సిందే. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)లోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తర్వాత భారత్ బయోటెక్ కంపెనీకి భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
 
దేశ వైద్య, ఆరోగ్య భద్రత విషయంలో భారత్ బయోటెక్ ఒక ముఖ్యమైన సంస్థ అని.. ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌‌లోని భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించనుందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.