ఢిల్లీలో పెరిగిపోతున్న అరాచకాలు.. హోటల్ బిల్లు కట్టమంటే కాల్చిపారేశాడు!
దేశరాజధాని ఢిల్లీలో అరాచకాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కడపునిండా ఆరగించి దానికి బిల్లు కట్టమని అడిగినందుకు ఓ హోటల్ యజమానిని ఓ కస్టమర్ గన్తో కాల్చిన ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే వసుదేవ్ (60) అనే వ్యక్తి ఢిల్లీలోని లజపత్ నగర్లో సింధి ఢాబా పేరిట ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో మారుతి స్విఫ్ట్లో వచ్చిన ముగ్గురు దుండగులు భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు.
బిల్లు కట్టి బయటికి కదలమని యజమాని వసుదేవ్ వారిని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తుపాకి తీసి వసుదేవ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 2 బుల్లెట్లు వసుదేవ్ శరీరంలోకి చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు వచ్చేసరికి ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులు వసుదేవ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతుతున్నారు.