శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (13:15 IST)

లాక్డౌన్ 6.O పై కేంద్రం ఫోకస్? : వద్దనే వద్దంటున్న రాష్ట్రాలు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 8వ తేదీ నుంచి దేవాలయాలను తిరిగి తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకునేందుకు వీలుగా లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. పైగా, లాక్డౌన్ ఆంక్షలను కూడా కేంద్రం సడలించింది. దీంతో దేశంలో కరోనా వైరస్ బుసలుకొడుతోంది. ఫలితంగా కొత్తగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12 వేల మార్క్‌ను కూడా దాటేసింది. 
 
తొలి 100 కేసులు వచ్చిన తర్వాత, మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరడానికి 64 రోజుల సమయం పట్టగా, ఆపై 15 రోజుల వ్యవధిలోనే రెండు లక్షలకు, ఆపై 10 రోజుల్లోనే కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసింది. ప్రస్తుతం కేసుల సంఖ్య విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, కరోనా మరణాల్లో తొమ్మిదో స్థానంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో జూన్ 15వ తేదీ తర్వాత మరోసారి లాక్డౌన్‌ను ప్రకటిస్తారని వార్తలు వస్తుండగా, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ ఆలోచన సరికాదని అంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ లాక్డౌన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 
రాష్ట్రంలో మరోమారు లాక్డౌన్ అమలు చేయబోతున్నారంటూ తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఖండించారు. అలాగే, ఇలాంటి పుకార్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 
 
అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ లాక్డౌన్‌ను అమలు చేయబోమని స్పష్టం చేశారు. అదేసమయంలో ప్రజలు రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. 
 
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు కూడా మరోసారి లాక్డౌన్ ను వ్యతిరేకిస్తోంది. "లాక్డౌన్‌ను కొనసాగించాలని భావించడం లేదు" అని ఢిల్లీ వైద్య మంత్రి సత్యేందర్ జైన్ వ్యాఖ్యానించారు. మొత్తంమీద దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు.