ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:40 IST)

'మర్కజ్' భవనంలో రహస్య అరలు.. ఫోరెన్సిక్ అధికారుల తనిఖీలో బహిర్గతం

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో అనేక రహస్య అరలు ఉన్నట్టు సైబర్ ఫోరెన్సిక్, బయాలజీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్‌ కార్యాలయాన్ని ఆదివారం ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎస్ఎన్ఎల్) ప్రతినిధుల సంయుక్త బృందం నిశితంగా పరిశీలన చేసింది. మార్చిలో ఈ కేంద్రంలో జరిగిన సమావేశానికి దేశం నలుమూలల నుంచి పలువురు హాజరుకావడం, ఆ తర్వాత వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. ఆ తర్వాత భవనంలో ఉన్న జమాత్ వర్కర్లందరినీ ఖాళీ చేయించి, సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఆ తర్వాత భవనం మొత్తాన్ని క్వారంటైన్ చేసి.. వైరస్ నిర్మూలనా చర్యలు చేపట్టారు. అలాంటి భవనంలోకి ప్రవేశించడం సురక్షితమని సర్టిఫికెట్ వైద్యశాఖ ఇవ్వడంతో ఆదివారం రెండు విభాగాలకు చెందిన సైబర్ ఫోరెన్సిక్ యూనిట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తోఫాటు ఫొటో డివిజన్ ప్రతినిధులు కేంద్రంలోని రెండు విభాగాల్లోని ఐదంతస్తులను పరిశీలించారు. 
 
దాదాపు ఆరు గంటలపాటు భవనంలోని ఆమూలాగ్రం పరిశీలించిన బృందం ప్రతినిధులు భవనం మొత్తాన్ని మ్యాప్ చేశారు. వీడియో షూట్ చేశారు. భవనంలో చాలా రహస్య అరలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'మాతోపాటు మేనేజ్మెంట్ కమిటీకి చెందిన మౌలానాలను కూడా తీసుకువెళ్లాం. వారి సమక్షంలోనే భవనంలోని కార్యాలయం నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. మార్చి నెలలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని భవనం మేనేజరుని అడిగాం. అవసరమనుకుంటే మరోసారి భవనాన్ని సందర్శిస్తాం' అని తెలిపారు.