బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (21:49 IST)

ముంబైలో 'కరాచీ బేకరీ' రచ్చ ... పేర్లు మార్పించడం శివసేన వైఖరి కాదు

మహారాష్ట్రలో కరాచీ బేకరీ వివాదం చెలరేగింది. నిన్నామొన్నటి వరకు బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు, ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదంతో ముంబై రాజకీయాలు అట్టుడుకిపోయాయి. ఇపుడు కరాచీ బేకరీ వివాదం తెరపైకి వచ్చింది. 
 
ఈ వివాదానికి గల కారణం పరిశీలిస్తే, ముంబైలో కరాచీ బేకరీ చాలా ప్రాముఖ్యతతో పాటు మంచి పేరుంది. గత 60 యేళ్లుగా ఇది ముంబై నగర వాసులకు సుపరిచితం. అయితే, కరాచీ బేకరీ పేరు మార్చాలని ఓ షాపు యజమానికి శివసేన నేత అల్టిమేటం ఇచ్చారు. ఇదే మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేసింది.
 
అసలు వివాదం ఏంటంటే.. నగరంలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న కరాచీ బేకరీకి వచ్చిన శివసేనకు చెందిన నితిన్ నంద కిశోర్ అనే నేత.. కరాచీ పేరు మార్చాలంటూ షాపు యజమానికి అల్టిమేటం జారీ చేశారు. మార్చిన పేరు కూడా హిందీ, ఇంగ్లీషులో కాకుండా మరాఠీలో రాయాలని సూచించారు. దీంతో తీవ్ర భయానికి లోనైన షాపు యజమాని షాపు పేరుపై కవర్ కప్పేశాడు. 
 
'నువ్వు కరాచీ నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నావు. నువ్వు ఏ మతాన్ని అయినా పాటించు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ముస్లిమైన కావొచ్చు, హిందువైనా కావొచ్చు. కానీ ముంబైలో ఉంటున్నావు. కానీ కరాచీ అనే పేరు పాకిస్థాన్‌ నుంచి వచ్చింది. దేశ విభజన అనంతరం మీరు ఇక్కడ బతుకున్నారు. ఇక్కడ ఉండండి, హాయిగా వ్యాపారాలు చేసుకోండి. కానీ ఆ పేరు మాత్రం తొలగించండి' అని షాపు యజమానితో నితిన్ అన్నారు. దీన్నంతిటినీ వీడియో తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు.
 
కాగా, దీనిపై విమర్శలు రావడంతో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. 'కరాచీ బేకరీలు, కరాచీ స్వీట్లు, బిస్కెట్లు సుమారు 60 ఏళ్లుగా ముంబైలో ఉంటున్నాయి. కరాచీ అని ఉన్నంత మాత్రాన వారు పాకిస్థానీలు కాదు. ఇప్పుడు వారి షాపుల పేర్లు, స్వీట్ల పేర్లు మార్చాలని అడగడం పూర్తిగా అర్థం లేనిది. పేర్లు మార్చడం శివసేన వైఖరి కాదు' అని ఇంగ్లీషు, మరాఠీలో సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.