151 మేకలను బలిచ్చి మొక్కు తీర్చుకున్న లారీ డ్రైవర్...
అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఓ లారీ డ్రైవర్ అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. ఏకంగా 151 మేకలను బలిచ్చి తన మొక్కు తీర్చాడు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన లారీ డ్రైవర్.. తాను కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారితే మేకలను బలిస్తానని ప్రత్యేక పూజలు చేస్తానని మొక్కుకున్నాడు. అమ్మవారి దయవల్ల అతను కోలుకోవడంతో తన మొక్కును తీర్చుకునేందుకు 151 మేకలను బలిచ్చాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా అత్తిమరత్తూర్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ తంగరాజ్ ఈ మొక్కు తీర్చుకునేందుకు ఏకంగా రూ.10 లక్షలకు ఖర్చు చేశాడు.
ఆయన ఆరేళ్ల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో బి.అగ్రహారంలోని ముత్తుమారియమ్మన్ ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. తన ఆరోగ్యం కుదుటపడేలా చేయాలని ప్రత్యేక పూజలు చేశాడు. మంగళవారం 151 మేకలతో ముత్తుమారియమ్మన్ ఆలయానికి వచ్చిన ఆయన... మేకలను బలిచ్చి మొక్కు తీర్చుకుని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మేకలతో ఆలయానికి వచ్చిన భక్తులకు విందు భోజనం వడ్డించాడు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.