శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (07:09 IST)

అన్ లాక్ 3.0 పూర్తి మార్గదర్శకాలు మీకు తెలుసా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ ఆంక్షలను అన్ లాక్ పేరుతో సడిలిస్తూ వస్తోంది. ఈ నెల 31తో అన్లాక్ 2.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ లాక్ 3.0 ద్వారా కేంద్రం మరిన్ని కార్యకాలాపాలకు అనుమతులు ఇచ్చింది.
 
కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల నిర్వహించుకునే కార్యకలాపాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించి మరింత అప్రమత్తంగా ఉండాలి.
 
కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు:
అన్ లాక్ 3.0 పేరుతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో  కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మరిన్ని కార్యకాలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1 వ తేదీ నుంచి నుంచి ఆమలులోకి వస్తాయి.

కొత్తగా విడుదల చేసిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన ప్రతిస్పందనల ఆధారంగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలతో విస్తృతంగా చర్చించి  విడుదల చేశారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా అదనపు ఆంక్షలు విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను సడలించే అధికారం మాత్రం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది.
 
మార్గదర్శకాలలోని ముఖ్యాంశాలు:
* రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. అయితే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
* ఆగస్టు 5 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో జిమ్స్, యోగా సెంటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సెంటర్లలో సామమాజిక దూరం పాటించడం, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్.ఒ.పి)ను పాటించాల్సి ఉంటుంది. 
* సామాజిక దూరం, ఇతర ఆరోగ్య సంబంధిత ప్రొటోకాల్స్ పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 'అట్ హోం' కార్యక్రమాలు జరుపుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 21-07-2020న జారీచేసిన ఆదేశాలను పాటించాలి.
* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విస్తృతంగా చర్చించిన మీదట స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను 2020 ఆగస్టు 31 వరకు మూసివేసి ఉంచాలని నిర్ణయించారు.   
 * శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. కొవిడ్-19 ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఈ కార్యకలాపాలు సాగుతాయని తెలిపింది. 
* అంతర్జాతీయ విమాన ప్రయాణికులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. కేవలం వందేభారత్ మిషన్ కింద మాత్రమే ప్రయాణాలను అనుమతిస్తారు. మరింత మందిని అనుమతించే విషయం పరిస్థితిని  బట్టి నిర్ణయం తీసుకుంటారు.
* సినిమా థియేటర్లకు, మెట్రో రైళ్లకు, అనుమతి నిరాకరణ

* కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రాంతాలలో ఈ కిందివాటికి మినహా అన్నీఅనుమతిస్తారు:
- స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు 

- సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, అకడమిక్, సాంస్కృతిక, మతపరమైన కార్య కలాపాలు మరియు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ పైన పేర్కొన్న వాటిలో పరిస్థితిని అంచనా వేసి దశలవారీగా అనుమతి ఇనున్నట్లు కేంద్రం తెలిపింది. 
 
కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా లాక్డౌన్ :
* కంటైన్మెంట్ జోన్లలో 2020 ఆగస్టు 31 వరకూ లాక్డౌన్ కఠినంగా అమలు జరుగుతుంది.
 
* కంటైన్మెంట్ జోన్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు జాగ్రత్తగా గుర్తించి , కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటూ కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
 
* కంటైన్మెంట్ జోన్లలో, పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం పరిధిలో ఆంక్షల అమలు కఠినంగా ఉండాలి. కేవలం అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతించాలి.
 
* కంటైన్మెంట్ జోన్లను ఆ జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటిస్తాయి. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు తెలియజేస్తాయి.
 
* కంటైన్మెంట్ జోన్లలోని కార్యకలాపాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అథారిటీలు కఠినంగా అమలు చేయాలి. ఈ జోన్లలో కంటైన్మెంట్ చర్యలను కూడా పటిష్టంగా అమలు చేయాలి.
 
* కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడాన్ని కంటైన్మెంట్ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది.
 
* కంటైన్మెంట్ జోన్ల వెలుపల కార్యకలాపాలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి.
 
కంటైన్మెంట్ జోన్ల వెలుపల పరిస్థితులపై తమ అంచనాలకు అనుగుణంగా ఏవైనా కార్యకలాపాలను  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిషేధించవచ్చు. లేదా అవసరాన్ని బట్టి ఆంక్షలు విధించవచ్చు.
 
అయితే అంతర్ రాష్ట్ర, రాష్ట్రం లోపల, వ్యక్తుల ప్రయాణానికి  లేదా సరకుల తరలింపునకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. వేరుగా అనుమతి, ఆమోదం, ఈ-పర్మిట్ ఏదీ అవసరం లేదు.
 
వ్యాధి సోకే అవకాశం ఉన్న వారికి రక్షణ:
కరోనా సోకే అవకాశం ఉన్న 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ళలోపు పిల్లలు, వీరందరూ అత్యవసరాలు, ఆరోగ్యపరమైన అవసరాలకు తప్ప ఇళ్లలోనే ఉండాల్సిందిగా సూచించారు.  
 
ఆరోగ్యసేతు వాడకం:
ఆండ్రాయిడ్ మెబైల్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్ చేసుకోవడంతోపాటు దాన్ని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.