శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:51 IST)

మమతకు ఇసి నోటీసులు

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. ఎనిమిది దశల పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే అక్కడ మూడు దశలు ముగియగా... మరో ఐదు దశల పోలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార తృణమూల్‌, బిజెపిలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు... పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.

మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఓ మతాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఇసి నోటీసులు జారీ చేసింది.

ముస్లింలు ఓట్లు చీలిపోయేలా వేర్వేరు పార్టీలకు ఓటు వేయవద్దని, గంపగుత్తగా తమ పార్టీకే వేయాలని మమతా ఓటర్లను అభ్యర్థించారని బిజెపి నేత, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి ఇసికి ఫిర్యాదు చేశారు.

దీనిపై మోడీ కూడా స్పందిస్తూ... ఆమెలా మేము కూడా తమ హిందువులకే పిలుపునిస్తే... ఇసి ఊరుకుంటుందా... అంటూ బెంగాల్‌ ప్రచార సభల్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మమతకు ఇసి నుండి నోటీసు అందింది. దీనికి 48 గంటల్లోగా బదులివ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.