1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (20:03 IST)

శివసేన నేత సంజయ్ రౌత్ అరెస్టు : శివసేన అంతానికి కుట్ర!

sanjay rauth
మహారాష్ట్రలో ఆదివారం కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సంజయ్ రౌత్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రానికి ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత భారీగా బలగాలు మొహరింపు, భద్రత మధ్య సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు తమ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. 
 
తన అరెస్టుపై సంజయ్ రౌత్ స్పందించారు. ఈడీ అధికారులు అదుపులోకి తీసున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నాకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలను సృష్టించారు. శివసేనకు, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇది. దీనికి నేను భయపడను" అని ప్రకటించారు. 
 
అలాగే, సంజయ్ రౌత్ అరెస్టుపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ, తమ పార్టీని అంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలపై ఈడీ దాడులకు పాల్పడుతున్నారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ దాడులు ఈ కుట్రలో భాగమేనని, ఆయనను అరెస్టు చేసేందుకే ఇదంతా చేశారని పేర్కొన్నారు.