1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (13:08 IST)

టిక్ టాక్ తరపున కోర్టులో వాదించను : ముకుల్ రోహిత్గీ

చైనాకు చెందిన యాప్ టిక్ టాక్‌తో పాటు మరో 59 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అయితే, టిక్ టాక్ సంస్థ కోర్టును ఆశ్రయించనుంది. ఆ సంస్థ తరపున మాజీ అటార్నీ జనరల్ వాదించబోనని తేల్చి చెప్పారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరుపున కోర్టుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. 
 
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత్‌ సోమవారం నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌ టాక్‌తోసహా లైకీ, యూసీ బ్రౌజర్‌, కామ్‌స్కానర్‌, విగొ వీడియో, వంటి పలు యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. 
 
తూర్పు లఢక్‌ సరిహద్దులో ఈ నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 
 
మరోవైపు తమ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టిక్‌టాక్‌ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ ఆశ్రయించింది. 
 
తమ తరపున కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి వాదించాలని కోరింది. అయితే టిక్‌ టాక్‌ విన్నపాన్ని ముకుల్ రోహత్గి తిరస్కరించారు. చైనా యాప్‌ తరపున భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కోర్టులో వాదించబోనని ఆ సంస్థకు స్పష్టం చేశారు. దీంతో నిషేధంపై కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న టిక్‌టాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.