నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుంది. హర్యానాలో భార్యతో గొడవపడిన కారణంగా ఓ వ్యక్తి తన బిడ్డలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సీతామర్హికి చెందిన మనోజ్ కుమార్ (45) అనే వ్యక్తి కూలీగా పనిచేస్తూ.. ఫరీదాబాద్లోని సుభాశ్ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ కాలనీ రైల్వే ట్రాక్లకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం మనోజ్ కుమార్ తన నలుగురు కుమారులతో కలిసి ఆల్సన్ చౌక్ వద్ద జీటీ రోడ్డుపై ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ దారుణానికి పాల్పడటానికి ముందు మనోజ్ కుమార్ అరగంటకు పైగా తన పిల్లలతో రైల్వే ట్రాక్ సమీపంలో కూర్చున్నట్లు కొందరు స్థానికులు చెప్పారు. ఆ సమయంలో మనోజ్ తన పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ కూడా కొనిచ్చినట్లు తెలిసింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో మనోజ్ తరచూ గొడవపడేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మంగళవారం ఉదయం కూడా భార్య ప్రియతో మనోజ్కు తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలను పార్కుకు తీసుకెళ్తున్నానని భార్యకు చెప్పి, వారిని రైల్వే ట్రాక్ల వద్దకు తీసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మనోజ్ భార్య బోరున విలపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.