శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (14:53 IST)

కరోనా నిబంధనలు పాటించండి లేదా యాత్ర వాయిదా వేసుకోండి : రాహుల్‌కు కేంద్రం లేఖ

rahul padayatra
పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత భారత్ జోడా యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మాన్సుక్ మాండవీయ ఓ లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించాలని లేని పక్షంలో జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు సైతం కరోనా మార్గదర్శకాల అమలుకు సంబంధించిన మాండవీయ లేఖ రాశారు. 
 
కాగా, చైనా, జపాన్, కొరియా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులో పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే గత వారం రోజుల్లో ఏకంగా 35 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ జోడో యాత్రలో పాల్గొనేవారు మాస్కులు విధిగా ధరిస్తూ, శానిటైజర్లు వినియోగిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. 
 
"టీకాలు వేయించుకున్నవారే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలి. కరోనా నిబంధనలు పాటించాలి. అది సాధ్యపడకపోవడంతో ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితులు, జాతి ప్రయోజనాల దృష్ట్యా యాత్రను వాయిదా వేసుకోవాలి" అని లేఖలో పేర్కొన్నారు. 
 
రాహుల్ కొనసాగిస్తున్న ఈ యాత్రలో వేలాది మంది పాల్గొంటున్నారు. వీరంతా గుంపులు గుంపులుగా, ఒకరికొకరికి మధ్యలో ఎడం లేకుండా నడుస్తున్నారు. దీంతో కేంద్రం ఈ సూచనను చేయడం గమనార్హం. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రి రాసిన లేఖపై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.