ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (12:08 IST)

ఆర్టికల్ 370 రద్దు.. జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా సంచలన వ్యాఖ్యలు

జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా గతేడాది ఆగస్టులో ముఫ్తీని ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే దాదాపు 14 నెలల తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ఆమెపై పీఎస్ఏ అభియోగాలను ఉపసంహరించుకోవడంతో మంగళవారం ఆమెను విడుదల చేశారు.
 
అయితే విడుదలైన సందర్భంగా తన మద్దతుదారులతో ఆమె చేసిన తొలి ప్రసంగంలోనే ఆర్టికల్ 370 కొట్టివేతపై నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఈ ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం కొట్టివేయడం చట్టవిరుద్ధమనీ.., అప్రజాస్వామికమని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. 
 
దేశవ్యాప్తంగా తనలా ఎంతమందిని నిర్భంధంలో ఉంచారో.. వారందర్నీ విడుదల చేయాలని మెహబూబా డిమాండ్ చేశారు. ''నిర్బంధంలో ఉన్నంత కాలం ఆ చీకటి రోజు కేంద్రం తీసుకున్న చీకటి నిర్ణయం నా హృదయాన్ని, ఆత్మను ఇంకా బాధిస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని చాలామంది ప్రజల బాధ కూడా ఇదే. ఆ రోజు జరిగిన అవమానం, హింసను ఎవరూ మర్చిపోలేరు..'' అని ముఫ్తీ పేర్కొన్నారు. 
 
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలనీ.. వేలాది మందిని బలితీసుకున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కూడా గట్టిగా నిలబడాలని ఆమె తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.