1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (21:11 IST)

కరోనాతో స్నేహితుడు చనిపోయాడు, అతని భార్యకు నేను అండగా ఉంటానంటూ...

కరోనా చాలామంది జీవితాలను సర్వనాశనం చేసింది. కొన్ని కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోతే చివరకు మహిళలు ఒంటరిగా మారిపోవాల్సిన దుస్థితి. ఊహించని వైరస్ కారణంగా ప్రాణాలు పోయి చివరకు ఎన్నో కుటుంబాలు చిధ్రమయ్యాయి. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రాణస్నేహితుడు కరోనా థర్డ్ వేవ్‌లో చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అంతేకాదు స్నేహితుడు భార్యకు కొత్త జీవితాన్ని చూపించాడు. 

 
కర్ణాటక రాష్ట్రం చామరాజ్నగర్ జిల్లా ముల్లూరు గ్రామానికి చెందిన చేతన్ కుమార్, లోకేష్‌లు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం చేతన్‌కు అంబికను ఇచ్చి వివాహం చేశారు. వీరికి పిల్లలు లేరు.

 
అయినా సరే వీరు అన్యోన్యంగా ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేవారు. అయితే కరోనా థర్డ్ వేవ్ కాస్త చేతన్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. జనవరి మొదటి వారంలో కరోనా బారిన పడిన చేతన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 1వ తేదీన చనిపోయాడు.


చేతన్ మరణాన్ని అంబికా జీర్ణించుకోలేకపోయింది. అత్త ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ప్రాణ స్నేహితుడిని కోల్పోయానన్న బాధ లోకేష్‌లోను ఉండేది. 

 
అందులోను అంబికను చూసి బాధపడ్డాడు లోకేష్. లోకేష్‌కు వివాహం కాలేదు. దీంతో అంబికకు కొత్త జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అంబికా అత్తమామలను, తన ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించాడు. నిన్న ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అంబికకు కొత్త జీవితాన్ని చూపించాడు. ఇప్పుడిదే వీరు నివాసమున్న గ్రామంలో చర్చకు కారణమవుతోంది. లోకేష్ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు.