శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (13:16 IST)

పోలింగ్ పూర్తికాగానే కేబినెట్ మంత్రిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వేటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ నుంచి మంత్రి ఓం ప్రకాశ్ రాజ‌భర్‌ను తప్పించారు. ఆయన్ను కేబినెట్ తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ను యోగీ కోరారు. అయితే ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజభర్.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అణగారిన ప్రజల పక్షాన నిలవడమే ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటే… తనకేమి అభ్యంతరం లేదన్నారు. అయితే అన్ని వర్గాల వారితో సమానంగా అణగారిన వర్గాలకు కూడా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
 
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్‌ రాజబర్‌కు, బీజేపీకి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో ఆయన మంత్రి పదవికి ఏప్రిల్‌ 13వ తేదీనే రాజీనామా చేశారు. బీజేపీ ఎన్నికల గుర్తుపై పోటీచేయాలని కమలం పార్టీ తనను కోరినట్లు తెలిపారు. తాను ఒక్క స్థానం నుంచే పోటీచేస్తానీ.. కానీ, అది తన సొంత పార్టీ గుర్తుపై బరిలోకి దిగుతానని చెప్పానన్నారు. అయితే, దీనికి బీజేపీ అంగీకరించకపోవడంతో.. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గతంలో వివరణ ఇచ్చారు. 
 
ఈ నేపథ్యంలో తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేయడంపై రాజభర్ స్పందించారు. యోగి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. మొదట సామాజిక న్యాయ కమిటీని ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఆ రిపోర్ట్‌లోని మార్గదర్శకాలను అమలుచేసేందుకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఎంత‌ వేగంగా నిర్ణయం తీసుకున్నారో.. అంతేవేగంగా.. ఆ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు.