మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (12:49 IST)

చంద్రబాబుపై శివసేన వ్యంగ్యాస్త్రాలు... డూప్లికేట్ తాళం చెవితో...

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. డూప్లికేట్ తాళంతో అధికారం కోసం వెంపర్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించింది. 
 
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు ముమ్మరంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర విపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పటికే ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. సోమవారం ఆయన కోల్‌కతాకు వెళ్లి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశంకానున్నారు.
 
ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనించిన శివసేన... వ్యంగాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయంటూ వ్యాఖ్యానించింది. డూప్లికేట్ తాళం చెవితో అధికారం కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. 
 
తాను స్వయంగా పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు ఓడిపోతారంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రచారంలో ఐదు ప్రాంతీయ పార్టీల నేతలు తామే ప్రధానమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నాయని మే 23 తర్వాతే వీటితో ఐక్యత తేలుతుందన్నారు. మోడీకే మెజార్టీ వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నా చంద్రబాబు వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.