గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (12:00 IST)

యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లుగా పెంచాలి.. పరిశీలిస్తామన్న ప్రధాని

దేశంలో యువతుల కనీస వివాహ వయస్సును సవరించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ అంశంపై నియమించిన కమిటీ నివేదిక సమర్పించగానే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువతుల కనీస వివాహ వయస్సును సమీక్షించాలని అనేకవర్గాల నుంచి తనకు వినతులు వచ్చాయని చెప్పారు. 
 
గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల ఫలితంగా మొట్టమొదటి సారి పాఠశాలల్లో బాలురకంటే బాలికల చేరిక పెరిగిందని ప్రధాని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్‌ఏవో) 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోదీ ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా రూ.75 నాణేన్ని విడుదల చేశారు. ఎఫ్‌ఏవోను ఏర్పాటుచేసిన రోజునే ప్రపంచ ఆహార దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.
 
దేశంలో ప్రస్తుతం యువతుల వివాహ వయస్సు 18 ఉండగా, యువకులకు 21 ఏండ్లుగా వుంది. కనీస వివాహ వయసు 18 ఏండ్లు ఉండటం వల్ల ఆలోపే యువతులకు తల్లిదండ్రులు పెండ్లి చేసేస్తున్నారు. దానివల్ల యువతులు తమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా చిన్న వయసులో వివాహాల వల్ల యువతులు కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నారని, అందువల్ల వివాహ వయసును 21ఏండ్లకు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. 
 
దేశంలో ఆహార భద్రత కొనసాగేందుకు వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించటమే కీలకమని మోదీ అన్నారు. రైతుల కష్టార్జితాన్ని ఎంఎస్పీకి ప్రభుత్వం కొనుగోలు చేస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.