1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

అధిక కట్నం డిమాండ్ చేసిన వరుడు.. చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

groom
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కట్నం మరింతగా ఎక్కువగా అడిగిన వరుడిని వధువు కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి అవమానించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. 
 
ఈ జిల్లాలో పెద్దలు కుదిర్చిన వివాహంలో భాగంగా అక్కడి సంప్రదాయ "జై మాల" వేడుకలో వరడుు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడు అమర్జీత్ వర్మ స్నేహితులు వధువు కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన వరుడు.. దీనికి మరింతగా ఆజ్యం పోస్తూ వధువు కుటుంబం నుంచి కట్నాన్ని మరింతగా డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. 
 
ఈ వ్యవహారంపై పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన వధువు తరపు బంధువులు వరుడిని చెట్టుకు తాళ్లతో కట్టేశారు. దీనిపై వరుడు తరపు బంధువులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు చేరుకుని తాళ్ళతో చెట్టుకు కట్టేసిన వరుడిని విడిపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇరు కుటుంబాల మధ్య విచారణ జరుపుతున్నారు.