1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 మే 2023 (16:54 IST)

పర్యాటవరణ పరీక్షణలో బీసీసీఐ - ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు

bcci
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ఇందుకోసం ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌లో ఒక్కో డాట్​ బాల్​కు 500 చెట్లు నాటుతామని ప్రకటించింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్-16 సీజన్‌ ముగిసింది. మరి ప్లేఆఫ్స్​లో ఎన్ని డాట్​ బాల్స్​ నమోదయ్యాయి?, ఎన్ని మొక్కలను నాటబోతున్నారో తెలుసుకుందాం. 
 
చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 84 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి 96 డాట్ బాల్స్‌ వేశారు. గుజరాత్, ముంబై మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో 67 డాట్ బాల్స్‌ వేయగా..  చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 45 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. 
 
ఈ లెక్కన ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో మొత్తం 292 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయన్నమాట. అంటే 292×500 లెక్కన  బీసీసీఐ మొత్తం 1,46,000 మొక్కలు నాటనుంది. ఈ డాట్‌ బాల్స్‌లో సింహభాగం ఆకాశ్‌ మధ్వాల్, మహ్మద్‌ షమి, రషీద్‌ఖాన్‌, మతీశా పతిరనలదే కావడం గమనార్హం. 
 
భారత క్రికెట్ బోర్డు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. భవిష్యత్తులోనూ ఇలానే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే.