గురువారం, 7 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2025 (16:07 IST)

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

victim
వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే పెళ్లయ్యాక డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లిపోయాడు భర్త. ఇక అక్కడ్నుంచి భార్యకు కష్టాలు మొదలయ్యాయి. నేను లేకుండా నువ్వు ఎలా వుంటున్నావు, ఎవరితో లింక్ పెట్టుకున్నావు, ఎవరితో తిరిగుతున్నావు అంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు భరించలేని వివాహిత సెల్పీ వీడియో తీసి అన్ని వివరాలు చెప్పి ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నీరు పెట్టిస్తుంది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సిరిసిల్ల బోయినపల్లికి చెందిన తేజ్ అనే యువకుడు, శ్రావ్య అనే యువతి ప్రేమించుకున్నారు. 2020లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఇక అప్పట్నుంచి ఏదో వంకతో భార్య శ్రావ్యను అనుమానిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడి వేధింపులను తట్టుకోలేని శ్రావ్య తాడికల్లోని తన తల్లి ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
 
ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ వీడియో తీసింది. అందులో... తేజ్ నాపై లేనిపోని అభాండాలు వేసావు. నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు. నేను ఎవరితోనూ మాట్లాడటం లేదు. అందరిపై ఒట్టేసి చెబుతున్నాను. నీకు అంతగా నమ్మకం లేకపోతే నా ఫోన్ చెక్ చేసుకో. నిజం తెలుస్తుంది. నీ వేధింపులు భరించలేక చచ్చిపోతున్నాను. నువ్వు సంతోషంగా వుండు అంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడింది.