1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (11:48 IST)

ప్రియురాలు మోసం చేసిందనీ.. వంద మంది మహిళలను బ్లాక్‌మెయిల్ చేసిన ఘనుడు...

vadodara youth
తనను ప్రియురాలు మోసం చేసిందన్న అక్కసుతో ఆ ప్రియుడు ఏకంగా వంద మంది మహిళలను వడోదర‌కు చెందిన రాకేశ్ సింగ్ అనే వ్యక్తి మోసం చేశాడు. అలాంటి వ్యక్తిని వడోదర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను వెల్లడించిన విషయాలతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎంబీఏ యువకుడు రాకేశ్ సింగ్ అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను సంతోషపెట్టేందుకు రూ.1.5 లక్షలు ఖర్చు చేశాడు. కానీ ఆ అమ్మాయి అతడిని మోసం చేసి వెళ్లిపోయింది. దాంతో రాకేశ్ సింగ్ మహిళలందరిపైనా ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి మహిళలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు.
 
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా మహిళలకు వల విసిరేవాడు. విడాకులు తీసుకుని నూతన భాగస్వామి కోసం వెదుకుతున్న మహిళలను ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. బాగా పరిచయం అయ్యాక, వారితో సాన్నిహిత్యం పెంచుకుని వారి నగ్న చిత్రాలను పంపించాలని కోరేవాడు. కొందరు అతడు చెప్పినట్టే చేసేవారు. అక్కడినుంచి అతడి దోపిడీ మొదలయ్యేది.
 
కొందరిని బెదిరించి, కొందరికి ఉద్యోగాల ఆశ చూపి లక్షలు రాబట్టుకునేవాడు. తనను తాను బిజినెస్‌మేన్‌గా, కార్పొరేట్ ప్రొఫెషనల్‌గా, సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. కొందరు మహిళలతో తాను జడ్జినని కూడా చెప్పుకునేవాడని పోలీసులు వెల్లడించారు. మహిళలను నమ్మించడంలో అతడు ఆరితేరాడని వివరించారు. 
 
ఆన్‌లైన్‌లో కొందరు మహిళలను నమ్మించేందుకు తనను తాను ఓ మహిళగా పరిచయం చేసుకునేవాడని, వాట్సాప్ డీపీ స్టేటస్‌లో ఓ మహిళా పోలీసు అధికారి ఫొటో పెట్టేవాడని పేర్కొన్నారు. మహిళల నుంచి రాబట్టిన డబ్బును విలాసాలకు ఉపయోగించేవాడని, ఖరీదైన హోటళ్లలో దిగేవాడని, తరచుగా అమ్మాయిలను (ఎస్కార్ట్) వెంటేసుకుని తిరిగేవాడని తెలిపారు. అతడి బ్లాక్ మెయిలింగ్ తీవ్రతరం కావడంతో వడోదరకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కథ ముగిసింది. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.