బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (11:20 IST)

జ్వరంలో వ్యాయామం - ఇంటికొచ్చి కుర్చీలో కూలిపోయిన జిమ్ యజమాని

gym trainer heartattack
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ విషాద ఘటన జరిగింది. జ్వరలోనూ వ్యాయామాలు చేసిన జిమ్ యజమాని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన వ్యాయామాలు పూర్తి చేసుకుని జిమ్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొన్న తర్వాత గుండెపోటు రావడంతో మృత్యువాతపడ్డారు. 
 
ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ (33) అనే వ్యక్తి ఓ జిమ్ సెంటరును నడుపుతున్నాడు. ఈయన జిమ్‌కు వచ్చేవారితో కలిసి తాను కూడా వ్యాయామాలు చేస్తుంటారు. 
 
అయితే, గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ప్రతి రోజూ జిమ్‌కు వచ్చి వ్యాయామం చేయసాగాడు. ఈ క్రమంలో గత ఆదివారం కూడా అతను జిమ్‌కు వెళ్లి ఇంటికొచ్చాడు. ఓవైపు జ్వరంతో బాధపడుతూనే ఆఫీసుకు వెళ్లాడు. 
 
లోపలికి వెళ్లి తన సీటులో కూర్చున్నాడో లేదో గుండెపోటుకు గురయ్యాడు. తన సీటులోనే వెనక్కి వాలిపోయాడు. పక్కనే ఉన్నవాళ్లు ఆదిల్ పరిస్థితి చూసి హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయాడని చెప్పారు.
 
ఆదిల్ మరణవార్త విని ఆయన భార్యా పిల్లలు షాక్‌కు గురయ్యారు. తన భర్త వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని ఆదిల్ భార్య చెప్పారు. మామూలు జ్వరమేనని, తనకేమీ కాదని భర్త తేలిగ్గా తీసుకున్నాడని, ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయారు.