బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (11:47 IST)

ప్రేమ వివాహం... భర్త ఎడబాటును తట్టుకోలేక...

couple
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత యేడాదిగా గుట్టుగా సంసారం జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలో రోడ్డు ప్రమాదం రూపంలో భర్త మృత్యుఒడిలోకి చేరాడు. దీంతో ఆ మహిళ కుంగిపోయింది. భర్త లేని జీవితం తనకూ వద్దంటూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన అయోధ్య నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాచపూడి నాగరాజు (27) స్థానికంగా ఉన్న ఓ హోటల్లో టిఫిన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అయోధ్య నగర్‌కు చెందిన చల్లా ఉష (22)ను ప్రేమించారు. వీరిద్దరూ ఏడాది కిందటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయోధ్య నగర్‌లో కాపురం పెట్టారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు భర్త హోటల్‌కు వెళ్లి.. రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి వచ్చేవారు. 
 
సోమవారం పనికి వెళ్లి, అర్థరాత్రి అయినా ఇంటికి రాలేదు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బి. ఆర్.టి.ఎస్. రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు భార్యకు సమాచారం వచ్చింది. ఉష తన బంధువులతో కలిసి అక్కడికి వెళ్లారు. విగతజీవిగా పడివున్న భర్తను చూసేసరికి తట్టుకోలేకపోయారు. 
 
గుండెలవిసేలా రోదించారు. గుణదల కుమ్మరిబజారుకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై.. భానునగర్ కూడలి నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్లో అతి వేగంగా వెళుతూ నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. 
గాయాలతో వారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
 
ఈ ఘటనపై మృతుడి భార్య ఉష.. గుణదల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో.. ఇంటికి వెళ్లొస్తానని ఉష తన తల్లి ఆదిలక్ష్మి చెప్పి వెళ్లారు. కొద్ది సేపటికి తల్లికి అనుమానం వచ్చి కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. 
 
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. భర్త మరణాన్ని తట్టుకోలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదిలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం.. ప్రేమికుల ప్రాణాలను బలిగొంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.