1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 29 డిశెంబరు 2021 (20:38 IST)

స్టాలిన్ పాలన నేను గమనించలేదు, చూసి చెప్తా: సుబ్రమణ్యస్వామి

హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానన్నారు బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి. దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదన్నారు. బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదన్నారు. 

 
పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకిలు బ్రాహ్మణులు కాకపోయినా మహాత్ములుగా ఆధ్యాత్మిక ప్రచారం చేశారన్నారు. భారతదేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని.. హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానన్నారు. అనువంశిక అర్చకత్వంకు తాను వ్యతిరేకమన్నారు.

 
రమణదీక్షితుల ట్వీట్లు తాను గమనించలేదన్నారు. దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించను, న్యాయపోరాటం చేస్తానన్నారు. టిటిడి వెబ్ సైట్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారన్న ఒక పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు కేసు వేశానన్నారు.

 
అసత్య వార్తలు రాసిన తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలి, 100 కోట్లు జరిమాన చెల్లించాలన్నారు. తమిళనాడులో కరుణానిధి అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగిందని.. స్టాలిన్ పాలన తను సరిగ్గా చూడలేదనీ, చూసి చెపుతానని అన్నారు. తిరుపతిలోని కోర్టులో ఒక పత్రిక టిటిడిపై అసత్య ప్రచారం చేసిందంటూ పరువు నష్టదావా వేశారు సుబ్రమణ్యస్వామి. ఈ సందర్భంగా విచారణకు హాజరయ్యారు.