1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (08:44 IST)

కోవిడ్ మాత్రలతో ఎముకలు - కండలు దెబ్బతినే ప్రమాదం : ఐసీఎంఆర్ వార్నింగ్

తాజాగా దేశంలోకి కరోనా మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తొలుత అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ కరోనా మాత్రల కిట్ ఇపుడు మన దేశంలోకి కూడా వచ్చింది. అయితే, ఈ మాత్రల వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మోలు లైఫ్ మాత్రలతో కండరాలు దెబ్బతింటాయని, మోల్నుఫిరవిర్ మాత్రలతో ఎముకలు దెబ్బతింటాయని వివరించారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని తెలిపారు. 
 
ఇలా జరగడం వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ మాత్రలను కోవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని గుర్తుచేశారు. ఒకవేళ మహిళల ఈ మాత్రలను వాడితే కనీసం మూడు నెలల పాటు గర్భందాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
కాగా, కరోనా మాత్రలు మన దేశంలోకి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.