బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:32 IST)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు

rain
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిజానికి బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుంచి మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఒడిశా రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.
 
నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంకతో పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని చెప్పింది. 
 
ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాపై ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉండొచ్చని వెల్లడించింది. 
 
మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.