ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇద్దరు పిల్లలున్న 28 యేళ్ల మహిళను పెళ్లాడిన 60 యేళ్ళ వృద్ధుడు

marriage
ప్రేమ గుడ్డిదంటారు. ఇది నిజమని మరోమారు నిరూపితమైంది. ఇద్దరు పిల్లలున్న 28 యేళ్ల మహిళపై 60 యేళ్ల వృద్ధుడు మనసు పారేసుకున్నారు. పైగా, తన కుటుంబ సభ్యులు ఎంతగానో వారిస్తున్నప్పటికీ ఆయన వినిపించుకోలేదు కదా, ఏకంగా పోలీసుల సమక్షంలోనే పోలీస్ ఠాణాలోనే ఆ మహిళ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
 
ఈ రాష్ట్రంలోని భదోహి జిల్లాలోని బీహరోజ్‌పూ‌రుకు చెందిన రామ్ యాదవ్ అనే 60 యేళ్ల వృద్ధుడు.. 28 ఏళ్ల అషర్ఫీ దేవి అనే మహిళను ప్రేమించాడు. ఆమెకు అంతకు ముందే కృష్ణ మూరత్ యాదవ్‌తో వివాహమైంది. పైగా, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణ మూరత్ తమిళనాడులో పని చేస్తున్నాడు. ఇటీవల ఆషర్ఫీ దేవి.. రామ్ యాదవ్‌తో పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి రామ్ యాదవ్, అషర్ఫీ దేవిల ఆచూకీ కనుగొని వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తన భర్తతో వెళ్లనని, రామ్ యాదవ్నే వివాహం చేసుకుంటానని అషర్ఫీ దేవి పోలీసుల ఎదుట తెగేసి చెప్పింది. రామ్ యాదవ్ కూడా తన కుటుంబ సభ్యుల మాట వినలేదు. దీంతో చేసేదేమి లేక ఇరువురి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న గుడిలో బుధవారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.