1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 మే 2025 (17:04 IST)

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

supreme court
శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో 2015లో సదరు శ్రీలంక జాతీయుడుని భారత్‌లో అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద 2018లో ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి, పదేళ్ళ శిక్ష విధించింది. అయితే, 2022లో మద్రాస్ హైకోర్టు ఈ శిక్షను ఏడేళ్ల కాలానికి తగ్గించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని అప్పటివరకు శరణార్థ శిబిరంలో ఉండాలని ఆదేశించింది. దీంతో సదరు శ్రీలంక తమిళ జాతీయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 
 
తాను వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తనకు ప్రాణహాని ఉందని, పైగా, తన భార్యాపిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని తన పిటిషన్‍లో పేర్కొన్నారు. శిక్ష పూర్తయినా దాదాపు మూడేళ్లుగా నిర్బంధంలోనే ఉంచారని, దేశం నుంచి పంపించే ప్రక్రియను కూడా ప్రారంభించలేదని పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... భారత్ ధర్మసత్రం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పైగా, ఆర్టికల్ 19 హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది అని సూటిగా ప్రశ్నించింది. 
 
తాను శరణార్ధినని, శ్రీలంకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పదేపదే విన్నవించినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు. భారతదేశం మీ కోసం ఎదురుచూడటం లేదు. మీరు కోరుకుంటే మరో దేశానికి వెళ్లవచ్చు అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. చట్టప్రకారం నిర్ధేశించిన ప్రక్రియను పూర్తయిన తర్వాత పిటిషనర్‌ను శ్రీలంకకు పంపించాలని అధికారులను ఆదేశించింది.