బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (10:50 IST)

ముంబై టు హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు!

దేశంలో ఉన్న మహానగరాల జాబితాలో ముంబై, హైదరాబాద్‌లు కూడా ఉన్నాయి. ఇపుడు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా, ముంబై నుంచి హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలును నడపనుంది. ఈ ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఆదేశించింది. ఇందుకోసం రూ.7 కోట్ల నిధులను కూడా కేటాయించింది. 
 
సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారై, ఆపై బోర్డు రివ్యూ మీటింగ్ జరిగితే, రెండు నగరాల మధ్యా హై స్పీడ్ రైల్వే కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే ఇండియాలోని తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుగా ముంబై - అహ్మదాబాద్ మధ్య వచ్చే సంవత్సరం నుంచి పనులు ప్రారంభంకానున్న విషయం విదితమే.
 
ఇదే తరహాలో దేశంలో మరో ఐదు హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. వీటిలో సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య సెమీ హై స్పీడ్ రైల్ లైన్‌కు సహకరించేందుకు రష్యన్ రైల్వేస్‌కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ అంగీకరించింది. దేశంలో హై స్పీడ్ కారిడార్ల పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
 
ఇక హైదరాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 711 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది. పూణె మీదుగా సాగే రైల్వే లైన్ డీపీఆర్ తయారీకి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీపీఆర్ రెడీ అయిన తర్వాత దాన్ని రైల్వే బోర్టు సమీక్ష కోసం పంపాల్సివుంటుంది. అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లే డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే, నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 2023 నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.