మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (12:22 IST)

తమిళనాడు బీజేపీ చీఫ్ పోటీ చేసే స్థానంలో విపక్ష అభ్యర్థుల ఇళ్ళలో ఐటీ సోదాలు

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ స్వతంత్ర సంస్థలను ఏ విధంగా తమకు అనుకూలంగా వాడుకుంటుందో మరమారు నిరూపితమైంది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ తిరుప్పూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 
 
అయితే, స్థానం నుంచి బరిలోకి దిగుతున్న విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా, విపక్ష అభ్యర్థులు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్ తిరుప్పూరు జిల్లా ధారాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ప్రత్యర్థుల బంధువుల ఇళ్లపై ఆదాయపన్నుశాఖ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
బుధవారం ఇక్కడ ఎండీఎంకే నేత కవిన్ నాగరాజ్, ఆయన సోదరుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) కోశాధికారి చంద్రశేఖర్, డీఎంకే నేత ధనశేఖర్ ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి వరకు సోదాలు జరగ్గా నిన్న చంద్రశేఖర్ ఇంట్లో మళ్లీ తనిఖీలు నిర్వహించారు.
 
ఆదాయపన్ను అధికారుల దాడులపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. ప్రత్యర్థులను భయపెట్టేందుకే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. చంద్రశేఖర్ ఓ వ్యాపారవేత్త అని, ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల ఆరోపణలపై స్పందించిన మురుగన్ దాడులకు, బీజేపీకి సంబంధం లేదని వివరణ ఇవ్వడం కొసమెరుపు.