1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (12:23 IST)

పూంచ్ సెక్టార్‌లో నలుగురు ఉగ్రవాదులు కాల్చివేత

army forces
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని పూంచ్ సెక్టార్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ముష్కరులు హతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభంకాగా, ఇందులో డ్రోన్లతో పాటు నైటి విజన్ నిఘా పరికరాలను కూడా ఉపయోగించారు. 
 
ఈ ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున మళ్లీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభంకాగా, భద్రతా బలగాలు, టెర్రరిస్టులమధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. చనిపోయిన టెర్రరిస్టులను గుర్తించాల్సివుందని చెప్పారు. మరోవైపు, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం, సోపియాన్, అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో యాంటీ టెర్రర్ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఒక బ్యాంకు ఏటీఎం గార్డు హత్యకు గురైన నేపథ్యంలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ సోదాలు చేపట్టింది. 
 
ఇకపై అక్కడ ఫోటోలు తీయడంపై నిషేధం  
 
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ పాలక మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేదార్నాథ్ ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు బద్రీనాథ్‌-కేదార్నాథ్‌ ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆలయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. 
 
"కేదార్నాథ్‌ ఆలయంలోకి భక్తులు మొబైల్‌ ఫోన్లు తీసుకురావొద్దు. ఆలయం లోపల ఫొటోలు, వీడియోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఆలయంలో సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం'' అని ఆలయ కమిటీ తెలిపింది. గతంలో ఆలయ పరిసరాల్లో కొంతమంది భక్తులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది.
 
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాండీ ఇకలేరు... 
 
కేరళ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు ఉమెన్ చాండీ ఇకలేరు. సుధీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 యేళ్లు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆయన ఖాతాలో ఓ అరుదైన ఘనత ఉంది. ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే ఎన్నిక కావడం గమనార్హం. 
 
2020 సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా ఆయన ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాండీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నడూ పార్టీ మారలేదు కూడా. 
 
సొంత నియోజకవర్గం పూతుపల్లే తన కార్యక్షేత్రమని.. వీలైనంత వరకు ప్రజల మధ్య ఉండటమే తన విజయ రహస్యమని చాండీ పలుమార్లు వినయంగా చెప్పేవారు. ఎన్ని పనులున్నా.. ఏ హోదాలో ఉన్నా ప్రతి శనివారం రాత్రికి ఆయన పూతుపల్లి చేరుకునేవారు. ఆదివారం అంతా నియోజకవర్గంలో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేవారు. ఐదు దశాబ్దాలుగా దాన్ని ఓ నియమంగా పెట్టుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడూ ఇదే పాటించారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం దానికి మినహాయింపు ఉండేది.
 
ప్రజలతో ఈ అవినాభావ సంబంధమే ఆయనను ఆదర్శ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై సౌర కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వచ్చినా జనం విశ్వసించలేదు. అప్పట్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా ఓటర్లు ఆయనకు దన్నుగా నిలిచి విజయం కట్టబెట్టారు. ఆయన మృతిపట్ల కేరళ ప్రభుత్వం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.