శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (12:58 IST)

ప్రియుడు మోసం చేశాడనీ లైవ్‌లో పురుగులమందు తాగిన ప్రియురాలు

కన్నడ బుల్లితెర నటి చందన ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని పేర్కొంటూ లైవ్‌లో ఈ దారుణానికి పాల్పడింది. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్న 29 యేళ్ళ చందనను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హాసన్ జిల్లా బేలూరుకు చెందిన చందన బుల్లితెర నటిగా రాణిస్తోంది. ఈమె దినేశ్‌ అనే యువకుడిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో చందన పెళ్లి ప్రతిపాదన లేవనెత్తగా దినేశ్ తిరస్కరించాడు. దీంతో దినేశ్ కుటుంబ సభ్యుల వద్ద చందన తమ పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా వారు అవమానించి పంపించారు. 
 
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న చందన నిన్న బెంగళూరులోని తన నివాసంలో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అనంతరం దానిని దినేశ్‌కు వాట్సాప్ చేసింది.
 
వీడియో చూసిన దినేశ్ కంగారు పడి చందన ఇంటికొచ్చాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న చందనను ఆసుపత్రికి తరలించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే చందన ప్రాణాలు కోల్పోయింది. చందన సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దినేశ్ కోసం గాలిస్తున్నారు.
 
చందన తీసిన సెల్ఫీ వీడియోలో దినేశ్‌ తనను మోసం చేశాడని విలపించింది. తన డబ్బులు వాడుకున్నాడని, తన కెరియర్‌ను అతడి కోసం అర్పించానని వాపోయింది. ఇంతా చేస్తే అతడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని బోరుమంది. ఇక జీవించడం వృధా అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.