1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సిద్ధూతో ఎలాంటి విభేదాలు లేవు : డీకే శివకుమార్

dkshivakumar
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేసి, సిద్ధ రామయ్య తరపున నిలిచానని అన్నారు. 135 స్థానాల్లో విజయం సాధించి.. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌.. సీఎంగా ఎవరిని నియమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
'నాకు, సిద్ధరామయ్యకు మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. కానీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. చాలా సార్లు పార్టీ కోసం నేను త్యాగాలు చేశాను. సిద్ధరామయ్యతో కలిసి నడిచాను. ఆయనకు మద్దతుగా నిలిచాను' అని శివకుమార్ అన్నారు. 
 
శనివారం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలను కైవసం చేసుకోగా.. భాజపా 66, జేడీఎస్‌ 19 స్థానాలకు పరిమితమయ్యాయి. మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 
 
ఈ ఇద్దరికీ సీఎం పదవి చేపట్టగలిగే సత్తా ఉండటంతో ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న దానిపై అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లో రెబల్స్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీ, మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.