శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (13:17 IST)

రాజీనామాలపై మీరే నిర్ణయం తీసుకోండి... సుప్రీంకోర్టు

కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైగా, గురువారం జరగబోయే బలపరీక్షకు వెళ్లడం.. వెళ్లకపోవడం అనేది ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది.
 
మరోవైపు ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దీంతో విశ్వాస పరీక్షకు ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. సభలో ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానంపై ఎంత మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
ఇప్పటికే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమ పిటిషన్‌లలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీరి రాజీనామాలను ఆమోదించాలా.. లేక వీరి అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విచక్షణాధికారం స్పీకర్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చిచెప్పింది.
 
మరోవైపు, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదనీ, విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కుమార స్వామి స్పష్టంచేశారు. పైగా, సభలో మెజార్టీని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలా.. వద్దా అన్న విషయమై నిర్ణయాధికారాన్ని కోర్టు వారికే వదిలేయడంతో.. కుమారస్వామి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇపుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఆయన ప్రభుత్వం ఆధారపడింది.