శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (11:14 IST)

కేరళ ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల బంపర్ లాటరీ

anup auto driver
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన అనూప్ అనే ఆటో డ్రైవర్‌ అనూప్‌కు బంపర్ లాటరీ దక్కింది. దీంతో ఆయనకు ఉన్నఫళంగా రూ.25 కోట్లు వచ్చిపడ్డాయి. నిజానికి తొలుత ఓ లాటరీ టిక్కెట్ ఎంచుకున్నాడు. కానీ అది నచ్చకపోవడంతో మరో టిక్కెట్ తీసుకున్నాడు. ఇపుడు ఈ టిక్కెట్‌కే ఏకంగా రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురంలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన అనూప్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పైగా, ఈయనకు వంటల్లో మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో చెఫ్‌గా పని చేసేందుకు మలేషియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం బ్యాంకులో రూ.3 లక్షల రుణం కూడా  తీసుకున్నాడు. 
 
అదేసమయంలో అనూప్‌కు లాటరీల పిచ్చి ఉంది. ఎప్పటికైనా దశ తిరగకపోతుందా అని గత 22 ఏళ్లుగా లాటరీలు కొంటున్నాడు. మలేసియా వెళుతున్నాం కదా, చివరిసారిగా ఓ టికెట్ కొందాం అని ఓనం బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఎందుకనో ఆ టికెట్ నచ్చక, మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడా టికెట్టే అనూప్ జీవితాన్ని మార్చివేసింది. అతడిని కోటీశ్వరుడ్ని చేసింది. 
 
మొత్తం రూ.25 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. పన్నులు అన్నీ పోను ఆ ఆటోడ్రైవరుకు రూ.15 కోట్ల వరకు వస్తాయట. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటానని, అప్పులన్నీ తీర్చేస్తానని అనూప్ చెబుతున్నాడు. బంధువులకు సాయం చేయడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడతానని వెల్లడించాడు. అంతేకాదు, ఇక మలేసియా వెళ్లనని, కేరళలోనే ఉంటూ జీవనం సాగిస్తానని చెప్పాడు.