శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (13:49 IST)

కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమి ... గెలుపును తలకిందులు చేసిన ఒక్క ఓటు

కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగర పాలక సంస్థకు తాజాగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఇందులో బీజేపీ నామమాత్రపు ప్రభావం చూపుతోంది. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎన్.వేణుగోపాల్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. 
 
ఈయన కొచ్చి నార్త్ ఐలాండ్ డివిజన్ నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచి విజయం సాధించారు. దీనిపై వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఖచ్చితంగా తాను గెలవాల్సిన సీటని ఆయన అన్నారు.
 
అయితే, కౌంటింగ్, ఓటింగ్ మిషన్‌లో ఏం జరిగిందో చెప్పలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఓటింగ్ మిషన్‌తోనే సమస్య అంతా అని ఆయన చెప్పారు. అందుకే బీజేపీ అభ్యర్థి తనపై విజయం సాధించి ఉండొచ్చన్నారు. 
 
దీనిపై న్యాయస్థానానికి వెళ్లే విషయంలో తాను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలుసుకున్న అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుంటే, కేరళ రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి దూసుకువెళుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నామమాత్రపు ప్రభావాన్ని చూపుతోంది. 
 
ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా, దాదాపు అన్ని స్థానాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. మొత్తం 941 గ్రామ పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, 916 చోట్ల తొలి ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎల్డీఎఫ్ 476, యూడీఎఫ్ 378 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 25 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 37 చోట్ల ముందంజలో ఉన్నారు.
 
ఇక బ్లాక్ పంచాయితీల విషయానికి వస్తే, 152 స్థానాలకు ఎన్నికలు జరుగగా, ఎల్డీఎఫ్ 102 చోట్ల ఆధిక్యంలో ఉండి తిరుగులేని విజయం దిశగా వెళుతోంది. యూడీఎఫ్ 49 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. జిల్లా పరిషత్‌లను పరిశీలిస్తే, 14 జిల్లాలకుగాను ఎల్డీఎఫ్ 10, యూడీఎఫ్ 4 జిల్లాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఒక్క జిల్లానూ ఎన్డీయే దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
 
మునిసిపాలిటీల విషయానికి వస్తే, 86 స్థానాలకుగాను యూడీఎఫ్ 39, ఎల్డీఎఫ్ 38, ఎన్డీయే 3, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా, ఎల్టీఎఫ్ 4 చోట్ల, యూడీఎఫ్ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఈ సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.