శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (15:46 IST)

ఈత కొట్టిన సింహాలు - కజిరంగా ఫారెస్ట్‌లో కనిపించిన బంగారుపులి (Video)

అడవికి రారాజుగా చెప్పుకునే సింహానికి నీటిలో ఈదడం రాదని ఇప్పటివరకు భావించేవారు. అయితే ఇప్పుడీ వీడియో చూస్తే సింహాలు భేషుగ్గా ఈదుతాయని ఎవరైనా నమ్మేయాల్సిందే. గిర్ అడవుల్లోని ఓ రిజర్వాయర్‌లో మూడు సింహాలు ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరడాన్ని ఓ ఫారెస్ట్ గార్డు వీడియోలో రికార్డు చేశారు. 
 
ఆ మూడు సింహాలు పక్కపక్కనే ఈదుతూ ఒడ్డుకి చేరిన పిమ్మట మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనేకమంది వన్యప్రాణి నిపుణులు సింహాలు ఈదడం చూసి ఆశ్యర్యపోతున్నారు.
 
మరోవైపు, విశాల అటవీప్రాంతం మనదేశ సొంతం. అనేక వన్యప్రాణులకు ఆ అటవీ ప్రాంతం ఆవాసంగా ఉంది. అయితే, ఎంతో అరుదైన బంగారు రంగు పులి మాత్రం దేశంలో ఒక్కటి మాత్రమే ఉంది. 
 
ఆ ఒక్కటీ ఇటీవలే కజిరంగా అడవుల్లో దర్శనమిచ్చింది. సాధారణ పులులకు భిన్నంగా ఇది పసిడి వర్ణంలో మెరిసిపోతుంటుంది. దీని ముఖం కూడా ఇతర వ్యాఘ్రరాజాలకు భిన్నంగా కనిపిస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ దీని ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు.
 
అసోంలోని కజిరంగా ఫారెస్ట్‌లో ఆ గోల్డెన్ టైగర్ గడ్డిపొదల వెలుపల కూర్చుని సేదదీరుతూ ఉండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. దీనికి స్ట్రాబెర్రీ టైగర్, టాబీ టైగర్ అని ప్రాంతాల వారీగా వివిధ పేర్లు ఉన్నాయి. ఈ పులికి బంగారు వర్ణం రావడంపై  అటవీశాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్ వివరణ ఇచ్చారు. 
 
ఇది పుట్టుకతోనే జన్యులోపం వల్ల వస్తుందని వెల్లడించారు. ఇలాంటివి ప్రపంచంలో పలు చోట్ల జంతుప్రదర్శనశాలల్లో ఉన్నా, అటవీప్రాంతంలో కనిపించడం చాలా అరుదు అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.