శుక్రవారం, 22 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2025 (10:47 IST)

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ladoos
సాధారణంగా ఏదైనా సమస్య లేదా ఆపదలో ఉంటే తమను ఆదుకునేలా ముఖ్యమంత్రి సహాయ ఫోన్ నంబరు (సీఎం హెల్ప్ లైన్)కు ఫోన్ చేసి సమాచారం చేరవేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇపుడు నవ్వు తెప్పించేలా వుంది. పైగా అతను చేసిన ఫిర్యాదు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ అతను చేసిన ఫిర్యాదు ఏంటంటే.. ఈ నెల 15వ తేదీన జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత ఓ గ్రామంలో అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఆ సమయంలో కొందరికి రెండు లడ్డూలు ఇవ్వగా, ఆ వ్యక్తికి మాత్రం ఒకే లడ్డూ ఇచ్చారు. ఇది ఆ వ్యక్తికి ఆగ్రహం తెప్పించింది. దీంతో అతను వెంటనే సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ చిత్ర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అధికారుల కథనం ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామ పంచాయతీ భవనం వద్ద జెండా వందనం కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఉన్నవారందరికీ లడ్డూలు పంచిపెడుతున్నారు. ఈ క్రమంలో కమలేశ్ ఖుష్వాహా అనే గ్రామస్థుడి వంతు వచ్చింది. సిబ్బంది అతనికి ఒక లడ్డూ ఇచ్చారు. అయితే, తనకు రెండు లడ్డూలు కావాలని కమలేశ్ పట్టుబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను, వెంటనే పంచాయతీ భవనం బయటి నుంచే సీఎం హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. జెండా వందనం తర్వాత స్వీట్లు సరిగ్గా పంచడం లేదని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 
ఈ ఘటనను పంచాయతీ కార్యదర్శి రవీంద్ర శ్రీవాస్తవ ధ్రువీకరించారు. "ఆ గ్రామస్థుడు రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. మా సిబ్బంది ఒక లడ్డూ ఇచ్చారు. కానీ అతను రెండు కావాలని గొడవపడ్డాడు. ఇవ్వకపోవడంతో సీఎం హెల్ప్ లైన్‌కు కాల్ చేశాడు" అని ఆయన మీడియాకు తెలిపారు.
 
విషయం చిన్నదే అయినా సీఎం హెల్ప్ లైన్ వరకు వెళ్లడంతో పంచాయతీ సిబ్బంది నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఫిర్యాదు చేసిన కమలేశ్‌ను శాంతింపజేయడానికి, అతనికి కిలో స్వీట్లు కొనిచ్చి క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఇదే జిల్లాలో 2020 జనవరిలో కూడా ఇలాంటి వింత ఫిర్యాదు ఒకటి నమోదైంది. ఓ చేతి పంపు పనిచేయడం లేదని ఒకరు ఫిర్యాదు చేయగా, అప్పటి పీహెచ్ అధికారి ఒకరు "ఫిర్యాదు చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదు" అంటూ వివాదాస్పదంగా జవాబివ్వడం గమనార్హం.