ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (17:27 IST)

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడం పక్కా : ప్రధాని మోడీ జోస్యం

narendra modi
వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. పైగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏకంగా 370కు పైగా సీట్లను కైవసం చేసుకుంటుందని, ఆ దిశగా కార్యకర్తలు చర్యలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఝుబువా జిల్లాలో ఏర్పాటు చేసిన గిరిజనుల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తుందని ఆయన కితాబిచ్చారు. 
 
తమ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని మోడీ తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎన్నికల సమయంలోనే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తుకు వస్తారని విమర్శించారు. 2024లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమన్నారు. ఓట్ల కోసం కాదని, గిరిజనుల ఆరోగ్యం కోసమే సికిల్ సెల్ ఏనీమియాపై పోరాట యాత్ర ప్రారంభించామని ప్రధాని మోడీ తెలిపారు. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ఎంపీలో పర్యటించారు. 
 
కాంగ్రెస్ పార్టీ నినాదం దోచుకోవడం, విభజించడమే. గుజరాత్‌లో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడం వల్ల విద్యాభ్యాసం కోసం పిల్లలు కిలో మీటర్ల మేర నడిచి వెళ్లాల్సి రావడం చూశానని, నేను సీఎం అయ్యాక ఇతర ప్రాంతాల్లో స్కూళ్లను తెరిపించానని తెలిపారు. ఇపుడు గిరిజన పిల్లల కోసం దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెడితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన గత పదేళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లను ఏర్పాటు చేసిందని ప్రధాని మోడీ తెలిపారు.