1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (14:13 IST)

మమ్మీలా తయారైయ్యాడు.. అయితే ప్రాణాలతో బతికే ఉన్నాడు..

సాధారణంగా మమ్మీలు ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లలో ఉన్నాయని మనకు తెలుసు. మమ్మీలను నేపథ్యంగా చేసుకుని హాలీవుడ్‌లో సినిమాలు సైతం వచ్చాయి. అయితే ఓ వ్యక్తి ఆహారం లేక మమ్మీలా తయారయ్యాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.. ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి నెల రోజుల పాటు నరకయాతన అనుభవించి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడగలిగాడు. 
 
ఎలుగు బంటి గుహలో ఒక నెల రోజుల కాలం పాటు ఆహారం లేకుండా చివరకు మమ్మీలా తయారైయ్యాడు. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మంగోలియాకు దగ్గర్లోని తువా అనే అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ టైమ్‌లో అతడిపై ఎలుగు బంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దాడిలో అతడి వెన్నుముక సైతం విరిగిపోయింది. 
 
అలెగ్జాండర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి తర్వాత ఆ ఎలుగు బంటి అలెగ్జాండర్‌ను పాక్షికంగా పూడ్చేసి వెళ్లిపోయింది. కాగా ఊపిరి అందే స్థితిలో ఉన్న అలెగ్జాండర్ నెల రోజులు పాటు ఆహారం లేకుండా జీవచ్ఛవంలా బతికాడు. కొద్దిరోజుల క్రితం వేటకుక్కలతో వేటకు వచ్చిన కొంత మంది వేటగాళ్లు ఎలుగు బంటి గుహలో అలెగ్జాండర్‌ను గుర్తించారు. 
 
మట్టిలో కూరుకుపోయిన అతడిని చూసి ముందుగా మమ్మీ అని భావించారు. అతడు ప్రాణాలతో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స అనంతరం అలెగ్జాండర్ కోలుకున్నాడు. తాను ఎలుగు బంటి దాడి తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను వైద్యులకు తెలిపాడు.