మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నాకు నరేంద్ర మోడీ 15వ కుమారుడు.. ఆస్తి రాసిస్తా : వందేళ్ల బామ్మ ప్రకటన

mangibai tanwar
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమ్మ ఇటీవలే చనిపోయారు. ఆమెకు చేయాల్సిన అన్ని ఖర్మక్రతువులను ప్రధాని మోడీ అన్నీ దగ్గరుండి చేయించారు. ఇపుడు మరో అమ్మ తెరపైకి వచ్చారు. ఆమెకు వయసు వందేళ్ళు. తనకు నరేంద్ర మోడీ 15వ కుమారుడు అంటూ ప్రకటించారు. ఆమె పేరు మంగీబాయి తన్వర్. రాజ్‌గఢ్‌ జిల్లా హరిపుర గ్రామ వాసి. ఈమెకు 14 మంది సంతానం. అయితే మోడీని తన 15వ కుమారుడిలా భావిస్తానని ఆమె చెబుతోంది. 
 
ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే తనకూ ఎన్నో పథకాలు అందిస్తున్నారని తెలిపింది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని ఆ బామ్మ చెప్పుకొచ్చింది. అందుకే మోడీని తన 15వ కుమారుడిగా భావిస్తూ.. తన 25 ఎకరాల ఆస్తిని ఆయన పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీబాయి స్పష్టం చేసింది.
 
'మోడీ నాకు ఇల్లు ఇచ్చి.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వితంతు పింఛను ఇచ్చి ఆర్థిక స్తోమత కల్పిస్తున్నారు. ఆహారం అందిస్తున్నారు. ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగాను. అందుకే ఆయన నా కుమారుడు. అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉంది అని మంగీబాయి వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ భామ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


విలేఖరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లు : ఏపీ ప్రభుత్వ విప్ కాపు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలేకరులను ఉద్దేశించి ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేఖరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లతో పోల్చారు. ముఖ్యంగా, కొన్ని చానళ్ళలో పని చేసే విలేఖరులు వ్యభిచార గృహాల్లో పని చేసే బ్రోకర్ల కంటే హీనంగా ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారంతా ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే మంచిందని హితవు పలికారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అయిన ఈయన గారు.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ విప్‌గానూ వ్యవహరిస్తున్నారు. రాయదుర్గంలో మాట్లాడుతూ విలేకరులపై మండిపడ్డారు. 
 
నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో కొన్ని మీడియా చానళ్లు, పత్రికలు వ్యవహరించిన తీర్పును ఆయన తీవ్రంగా తప్పుబడుతూ మీడియాపై పరుష పదజాలంతో రెచ్చిపోయారు. గ్రామస్థులు పత్తిపొలాల్లో పనులకు వెళ్లారని, వారొచ్చిన తర్వాత కలిసి ఫోటోలు తీయించుకుంటున్నామంటూ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలుతమకు బ్రహ్మరథం పడుతుంటే దీన్ని జీర్ణించుకోలోని కొందరు విలేకరులు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ విలేఖరులను బూతులు తిట్టారు. 
 
బాలికను ప్రేమించి ఒకరు.. బెదిరించి మరొకరు... 
 
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ప్రేమించి ఒకరు.. బెదిరించి మరొకర కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కరీంనగర్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదేకాలనీలో ఉండే ఇంటర్‌ చదివే బాలుడు, ఆమె ప్రేమించుకునేవారు.  సుమారు ఏడాది కిందట ఓ సందర్భంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా చిత్రీకరించారు. 
 
వాటిని చూపుతూ.. తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వారి స్నేహితులైన మరో ముగ్గురు బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల కిందట విషయం షీటీమ్‌ దృష్టికి వెళ్లడంతో వారు.. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. విషయాన్ని రహస్యంగా ఉంచారు.
 
సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. 
 
కేసు నమోదైన ఆరుగురిలో ఐదుగురు ఇంటర్మీడియట్ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్‌ అని, అతను పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని వెల్లడించారు.