శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (09:47 IST)

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్ సింగ్‌

మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ మళ్లీ రాజ్యసభలో తన వాణి వినిపించబోతున్నారు. ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజస్థాన్‌‌ బీజేపీ నేత, రాజ్యసభ్యుడు మదన్‌లాల్ సైనీ మరణించడంతో ఆ పదవికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ గురువారం నిర్ణయించింది.
 
డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం జూన్‌లో ముగిసింది. ఆయన 28 సంవత్సరాలపాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. మదన్ లాల్ సైనీ గత సంవత్సరమే రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఆయన ఇటీవల మరణించారు. 
 
పైగా, రాజస్థాన్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్టీ అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ పదవికి జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7వ తేదీన విడుదలవుతుంది. ఎన్నిక ఈ నెల 26న జరుగుతుంది, ఫలితాలు అదే రోజు ప్రకటిస్తారు.