బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (10:13 IST)

అరేబియా సముద్రంలో కూలిన మిగ్ 29 : పైలట్ల కోసం గాలింపు

అరేబియా సముద్రంలో మిగ్ 29 రకం శిక్షణ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. గురువారం రాత్రి ఇద్దరు పైలెట్లతో వెళుతున్న ఈ మిగ్-29కే యుద్ధ విమానం ఉన్నట్టుండ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సా నుంచి బయల్దేరిన మిగ్‌-29కే విమానం గురువారం సాయంత్రం 5 గంటలకు అరేబియా సముద్రంలో కూలిపోయిందని భారత నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని వెల్లడించారు. 
 
కూలిపోయే ముందు ఇద్దరు పైలట్లూ బయట పడ్డారని, ఓ పైలట్ క్షేమంగా బయట పడ్డారని తెలుస్తోంది. మరో పైలట్ కోసం వెతుకులాట కొనసాగుతోందన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై విచారణకు ఆదేశించామని తెలిపింది.
 
కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత రక్షణ శాఖ వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. 
 
కాగా, ఈ యేడాది మిగ్‌-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి. గత ఫిబ్రవరిలో గోవా తీరంలో మిగ్‌-29 కే శిక్షణ విమానం ఉదయం 10.30 గంటలకు కూలిపోయింది. అయితే అందులో ఉన్న పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు.