ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (08:51 IST)

దేశ వ్యాప్తంగా జెండా పండుగు.. ఎర్రకోటపై త్రివర్ణపతాకం రెపరెపలు

pmmodi
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశం అంతటా జెండా పండుగను జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగురవేశారు. ఆయన వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 
 
అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్​ఘాట్​కు వెళ్లిన మోదీ.. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
 
కాగా, స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ప్రభుత్వం 'ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌' పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేడుకలకు కొత్త శోభను తీసుకొచ్చింది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. 
 
గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్‌-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.
 
కాగా, స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వేడుకలకు హాజరయ్యే ఏడువేల మంది కోసం బహుళ అంచెల భద్రత ఏర్పాటుచేశారు.
 
ఇందులో భాగంగా ముఖ కవళికలను గుర్తించే కెమెరాలు, వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో 'నో కైట్‌ ఫ్లై జోన్‌'గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు.