1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (10:09 IST)

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

parliament
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఇవి ఆగస్టు 12వ తేదీ వరకు జరుగుతాయి. మొత్తం 26 రోజుల పాటు 18 సార్లు సభా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఇందులోభాగంగా, సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తారు. 
 
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పాతవి, కొత్తవి కలిపి దాదాపు 31 బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే, కాలం చెల్లిన 71 చట్టాలను తొలగించనున్నారు. 
 
మరోవైపు, ఈ సమావేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ధరల పెరుగుదల, వివాదాస్పద అగ్నిపథ్ పథకం వంటి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 
 
అదేసమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన లోక్‌సభ  సభ్యులు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, అబుదాబీ అధినేత షేక్ ఖీలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సహా పలువులు మాజీ ఎంపీల మృతికి లోక్‌సభ సంతాపం తెలుపుతుంది.