శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:16 IST)

ఉగ్రవాదులకు చేతిగాజులు పంపుతామన్నారు : అజిత్ ధోవల్

అశాంతి సృష్టించేందుకు భారత్‌లో చొరబడిన ఉగ్రవాదులు తమకప్పగించిన పనిని సత్వరమే అమలు చేయకపోతే వారికి చేతిగాజులు పంపుతామని పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల నేతలు హెచ్చరించారు. భారత్‌, పాక్‌లోని వ్యక్తుల మధ్య జరుగుతున్న టెలిఫోన్‌ సంభాషణల ద్వారా ఈ విషయం తమకు తెలిసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ వెల్లడించారు. 
 
ఢిల్లీలో శనివారం ప్రత్యేక ఆహ్వానితులైన కొందరు పాత్రికేయులతో ధోవల్‌ మాట్లాడారు. కాశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థాన్‌ 230 మంది ఉగ్రవాదులను సిద్ధం చేసిందన్నారు. వీరిలో ఇప్పటికే కొందరు సరిహద్దు దాటారన్నారు. ఉగ్రవాదులకు సందేశాలు పంపేందుకు పాకిస్థాన్‌ సరిహద్దు వెంట 20 కి.మీ. పొడవున కమ్యూనికేషన్‌ టవర్లను ఏర్పాటు చేసిందన్నారు. 
 
'అన్ని యాపిల్‌ లారీలు ఎలా తిరుగుతున్నాయి? వాటిని మీరు ఆపలేరా? మీకు తుపాకులకు బదులు గాజులు పంపాలా?' అంటూ అవతలి వ్యక్తి మాట్లాడటం వినిపించిందని ధోవల్ అన్నారు. ఈ సంభాషణ అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు సోపోర్‌లోని పండ్ల వ్యాపారి హమీదుల్లా ఇంటికి వెళ్లారని చెప్పారు. ఇంట్లో హమీదుల్లా లేకపోవడంతో ఆయన కుమారుడు, మనుమరాలుపై కాల్పులు జరిపి పారిపోయారన్నారు. 
 
రాష్ట్రంలో 199 పోలీసు జిల్లాలుండగా, కేవలం 10 జిల్లాల్లో మాత్రమే ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. చట్టం ప్రకారమే కొందరు రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచామని ధోవల్‌ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మోహరించిన సైనికులు అఘాయిత్యాలకు పాల్పడే ప్రశ్నే ఉత్పన్నం కాబోదని పేర్కొన్నారు.