గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (14:55 IST)

భారతదేశం ఓ పుత్రుడిని కోల్పోయింది : ముఖేశ్ అంబానీ ఎమోషనల్ పోస్ట్

ambani - ratan
భారత పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా మృతిపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశం విశేషమైన పుత్రుల్లో ఒకరిని కోల్పోయిందంటూ సుధీర్ఘ పోస్టు పెట్టారు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు. ప్రయమైన స్నేహితుడిని కోల్పోయానంటూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సుధీర్ఘ పోస్ట్ చేశారు. 
 
"రతన్ టాటా మరణంతో భారతదేశం తన అత్యంత విశిష్టమైన, దయాగుణం కలిగిన పుత్రుల్లో ఒకరిని కోల్పోయింది. రతన్ టాటా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన వాటిని మన దేశానికి తీసుకొచ్చారు. టాటా గ్రూప్ ఛైర్మన్ 1991లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టాటా గ్రూప్‌ను 70 రెట్లు పెంచారు. రిలయన్స్ కంపెనీ, నీతా అంబానీ, ఇతర అంబానీ కుటుంబం తరపున టాటా కుటుంబ సభ్యులకు, మొత్తం టాటా గ్రూపు సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. రతన్.. మీరెప్పుడూ నా హృదయంలో నిలిచే ఉంటారు" అని ఎక్స్ పోస్టులో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 
 
రతన్ టాటా మరణం భారతదేశానికి దుఃఖ దినమని ముకేశ్ అంబానీ అభివర్ణించారు. తనకు వ్యక్తిగత నష్టమని విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటాను దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా, పరోపకారిగా, ప్రియమైన స్నేహితుడిగా ముకేశ్ అంబానీ అభివర్ణించారు. దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా, దాతృత్వ నాయకుడిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. 
 
గ్లోబల్ స్థాయిలో భారత్ ఎదగడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని ముకేశ్ అంబానీ కొనియాడారు. దేశాభివృద్ధికి, దాతృత్వానికి ఎనలేని సహకారం అందించారని ప్రస్తావించారు. టాటా గ్రూపును ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. సద్గుణవంతుడు, గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తినిస్తాయని ముకేశ్ అంబానీ అన్నారు.
 
రతన్ టాటా మరణం టాటా గ్రూపుకేకాకుండా ప్రతి భారతీయునికి పెద్ద నష్టమని ముకేశ్ అంబానీ అన్నారు. వ్యక్తిగత స్థాయిలో తనకు కూడా తీరని శోకాన్ని నింపిందని విచారం వ్యక్తం చేశారు. తాను ప్రియమైన ఒక స్నేహితుడిని కోల్పోయానని, ఆయన చర్య తనకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. భారతదేశం ఒక పుత్రుడిని కోల్పోయింది.